దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో సరఫరా లోటు తలెత్తకుండా, ధరలు పెరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముడి చక్కెర, తెల్ల చక్కెరతో పాటు శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. అయితే ఇప్పటికే లోడింగ్ ప్రారంభమైన సరుకులు లేదా కస్టమ్స్కు అప్పగించిన చక్కెర నిల్వలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
ఇక ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఐరోపా దేశాలు, అమెరికాకు జరగాల్సిన చక్కెర ఎగుమతులపై ఈ నిషేధం ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


