పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (OG). గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘ఓజీ’ స్క్రిప్ట్ ప్రకారం పవన్ కల్యాణ్తో పాట పాడించే ఆస్కారం ఉందని తమన్ చెప్పారు. పవన్ కల్యాణ్తో పాట పాడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమన్ చెప్పడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. జపాన్ – ముంబయి నేపథ్యంలో ‘ఓజీ’ కథ ముస్తాబవుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్తో ‘ఓజీ’పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ పాట పడుతున్నారని తెలియడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. పవన్ కల్యాణ్తో తమన్ ఎలాంటి పాట పాడించబోతున్నారోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ తన సినిమాల కోసం తొమ్మిది పాటలు పాడారు. ‘తమ్ముడు’సినిమాలో ఏం పిల్లా మాట్టాడవా, తాటి చెట్టు ఎక్కలేడు అంటూ రెండు పాటలు పాడగా.. ‘ఖుషి’లో బయ్ బయ్యే బంగారు రవణమ్మ.. పాటను ఆలపించారు. ఇక ‘జాని’ సినిమాలో నువ్వు సారా తాగకురో, రావోయి మా ఇంటికి అంటూ రెండు పాటలు పాడారు. అలాగే ‘గుడుంబా శంకర్’సినిమా కోసం కిల్లీ కిల్లీ.. పాటను హమ్ చేశారు పవన్. ఇక ‘పంజా’సినిమాలో పాపారాయుడు.. ‘అత్తారింటికి దారేది’లో కాటమ రాయుడా పాటను పాడగా.., ‘అజ్ఞాతవాసి’లో కొడకా కోటేశ్వరరావు పాట పాడి అలరించారు. తమన్ చెప్పినట్టు జరిగితే ఓజీ కోసం పవన్ తన పదో పాటను పాడనున్నారు.