మల్కాజిగిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేగుతోంది. పార్టీ టికెట్ దక్కని ఆశావాహులు అసంతృప్తితో ఉన్నారు. టికెట్ పొందిన ఈటల, పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని, ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్న మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో ఈటల ఒంటరి పోరు సాగిస్తున్నారు.
మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అయితే, ఆయనకు కమలం పార్టీ నేతల సహాయం కరువైనట్టు తెలుస్తోంది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటుకు సీనియర్లు అనేక మంది పోటీ పడ్డారు. చివరకు అధిష్టానం ఈటెల రాజేందర్ కు ఈ సీటు కేటాయించింది. అయితే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన ఆశావాహులు ఈటలకు సాయం అందించేందుకు విముఖత చూపుతున్నట్టు సమాచారం. కొందరు నేతలు బిజెపిని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఈటల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ నుంచి అత్యధిక స్ధానాలను సాధించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే, బిజెపికి పక్కా గెలిచే అవకాశాలున్న మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా గందరగోళంగా తయారైంది. ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన కొంతమంది సినియర్ నాయకులకు ఆ అవకాశం దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా బిజెపిని గెలిపిస్తామని చెప్పిన నాయకులు అందరూ ప్రస్తుతం కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయవలసిన ముఖ్య నేతలు అందరూ ముఖం చాటేస్తున్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంటు టికెట్ ఆశించిన సీనియర్ నేతలైన మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పోటీకి అన్నిరకాలుగా సిద్దపడిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య అసంతృప్తితో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈటెలకు టిక్కెట్ ప్రకటించిన వెంటనే ఆయన రాజీనామాకు దిగారు.మల్కాజిగిరి టికెట్ అశించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ ఇప్పటివరకు ఈటల ప్రచారంలో కనిపించలేదు. నియోజకవర్గస్థాయి నేతలు సైతం ఈటలతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎవరు కనిపించకపోవడంతో కింది స్థాయి నాయకులు కలవర పడుతున్నారు.
పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తీరును సైతం పార్టీ శ్రేణులు తప్పు పడుతు న్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఈటలకు పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడం సరికాదని అంటున్నాయి. టికెట్టును దక్కించుకున్న ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచార సమాచారాన్ని సైతం స్థానిక నేతలకు ఇవ్వడం లేదని అంటున్నారు. ఈటల వెంట స్థానికేతరులు ఎక్కువగా ఉంటున్నారని, మల్కాజ్ గిరి ఎంపీ నియోజక వర్గానికి చెందిన బిజెపి నాయకులు ఎవరూ ఉండడం లేదని అంటు న్నారు. ఈటలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత స్థానిక నేతలు ఎవరిని స్వయంగా వెళ్లి పలకరించలేదని మల్కాజిగిరి నాయకులు అంటున్నారు. ఈటల రాజేందర్ ఒంటెద్దు పోకడ వల్ల పార్టీ నేతలందరూ దూరమవుతు న్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన నరేంద్ర మోడీ మల్కాజ గిరిలో బిజెపి గెలుపు కోసం రోడ్ షో నిర్వహించారు. అయినా ఇక్కడి నాయకుల మధ్య మాత్రం సమన్వ యం కనిపించడం లేదు.కమలం పార్టీలోని అసంతృప్తులు, అలక వహించిన నాయకులను బుజ్జ గించడానికి అధిష్టానం రంగంలో దిగింది.మల్కాజిగిరి నుంచి ఈటలను గెలిపించి పార్లమెంటుకు పంపితే కష్టపడి పనిచేసిన నేతలకు పార్టీ పదవులతోపాటు జాతీయస్థాయిలో నామినేట్ పదవులను ఇస్తామని అధిష్టానం హామీల వర్షం కురిపిస్తోంది. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.