అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ… వాషింగ్టన్ డీసీ ప్రైమరీలో డొనాల్డ్ ట్రంప్పై నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో ఆమె రిపబ్లికన్ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా ఘనత సాధించారు. దీంతో పాటు అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల తరఫున ప్రైమరీ నెగ్గిన తొలి భారత సంతతి అమెరికన్గా కూడా నిలిచారు.
గతంలో అగ్రరాజ్య అధ్యక్ష పదవిని ఆశించి పోటీ చేసిన భారత సంతతికి చెందిన బాబీ జిందాల్, కమలా హారిస్, వివేక్ రామస్వామి.. ఒక్క ప్రైమరీలోనూ విజయం సాధించలేదు. వరుస పరాజయాలతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష రేసులో వెనుకంజలో ఉన్న హేలీకి ఇదే తొలి ప్రైమరీ గెలుపు. వాషింగ్టన్ డీసీని సొంతం చేసుకోవడంతో ఆమె… వరుస విజయాలతో దూసుకుపోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు తొలిసారి అడ్డుకట్ట వేశారు. హేలీకి 51శాతం ఓట్లు రాగా, ట్రంప్ కేవలం 33.2శాతం ఓట్లకే పరిమితమయ్యారు. ఈ ప్రైమరీలోని 19 మంది రిపబ్లికన్ ప్రతినిధులనూ హేలీ సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఆమె ఖాతాలో దేశవ్యాప్తంగా 43 మంది ప్రతినిధులు చేరారు. ట్రంప్ గెలుచుకున్న 247 మంది ప్రతినిధులతో పోలిస్తే హేలీ ఇంకా చాలా వెనకంజలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడిని అధిగమించాలంటే మంగళవారం జరగనున్న 15 ప్రైమరీల్లో ఆమె భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినా సహా చాలా ప్రైమరీల్లో నిక్కీ ఓడారు. అయినప్పటికీ ఆమె రేసు నుంచి వైదొలగడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ట్రంప్కు తానే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారంలో పదేపదే చెబుతూ తన అభిమానులను ఉత్తేజపరుస్తున్నారు. ట్రంప్ వర్గీయులు మాత్రం.. డెమోక్రాట్లకు కంచుకోట అయిన వాషింగ్టన్ డీసీలో హేలీ గెలుపును తాము పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.