దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ప్రకటనను ఎన్టీఏ ( National Testing Agency విడుదల చేసింది. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది. రీ-ఎగ్జామినేషన్ను 2026 జూన్ 21, ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది.
మే 3న నిర్వహించిన అసలు నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. పరీక్ష పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో మే 12న పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా మెడికల్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పరీక్ష ఎప్పుడు మళ్లీ నిర్వహిస్తారు? అడ్మిట్ కార్డులు ఎప్పుడు విడుదల చేస్తారు? అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనిశ్చితిలో ఉండిపోయారు. తాజాగా జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించడం ద్వారా ఆ సందిగ్ధతకు తెరపడింది.
ఎన్టీఏ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. “NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ను 2026 జూన్ 21 ఆదివారం నిర్వహించాలని నిర్ణయించాం” అని పేర్కొంది.
అలాగే విద్యార్థులు , తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఎన్టీఏ సూచించింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని హెచ్చరించింది.
విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం ఎన్టీఏ ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు , ఇ మెయిల్ను కూడా అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు neet-ug@nta.ac.in కు మెయిల్ చేయవచ్చు. అదేవిధంగా 011-40759000 మరియు 011-69227700 హెల్ప్లైన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.
ఈ రీ-ఎగ్జామ్ నిర్వహణ దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాలపై కీలక ప్రభావం చూపనుంది. పరీక్ష పారదర్శకంగా, ఎటువంటి వివాదాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం , ఎన్టీఏ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.


