మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టీసీఎస్ కార్యాలయంలో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. గత 25 రోజులుగా పరారీలో ఉన్న ఆమెను గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీనగర్లో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై నాసిక్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. టీసీఎస్ క్యాంపస్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతపరమైన ఒత్తిళ్లకు సంబంధించి మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో మేనేజర్తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం… టీసీఎస్లో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నిదా ఖాన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా కొంతమంది ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను ఇస్లాం మత సిద్ధాంతాలను అనుసరించాలని, ఆ మతానికి సంబంధించిన దుస్తులు ధరించాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు నిదా ఖాన్పై కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం నాసిక్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. అనంతరం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.
నిందితురాలి కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టిన SIT అధికారులు చివరకు ఛత్రపతి శంభాజీనగర్లో ఆమె ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను నాసిక్కు తరలించి మరింత విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


