ఏపీ పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులతో రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎంపి కేశినేని శివ నాథ్ సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. హోమ్ మినిస్టర్ అనిత ఆధ్వర్యంలో కేంద్రం నుంచి హోం శాఖకు రావలసిన నిధులు, సంస్థల ఏర్పాటు గురించి పోలీస్ శాఖ అధికారులతో చర్చించామని చెప్పారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఉన్నాను. కేంద్రంలో రాష్ర్ట హోం శాఖకు సంబంధించిన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు.
రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ లు, జైళ్ళ అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది..అలాగే రాష్ట్రానికి గ్రేహౌండ్స్, అప్పా సంస్థలు రావాల్సి ఉందని కేశినేని శివనాథ్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి కేంద్ర నుంచి 118 సంస్థలు రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలపై దృష్టి పెట్టామన్న ఎంపీ.. కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న నిధులు, రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను.. ఏపీ హోం మంత్రి అనిత, రాష్ట్ర పోలీసు అధికారులతో కలుస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.