మనకు వచ్చిన సంఖ్యా బలం తక్కువ. కాబట్టి అసెంబ్లీలో మనం చేసిది తక్కువే. కౌరవులు లాంటి వ్యక్తులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో చేయగలుగుతా మనే నమ్మకం లేదు. ఇలా ఒకదాని వెంట మరోటిగా కీలక వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. అధికారపక్షం పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందు కుంటాయి అంటూ వైసీపీ అదినేత చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి ? ప్రజల్లోనే తేల్చుకునేందుకు జగన్ సిద్దమయ్యారా ?
సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి, ప్రతీ గడపకు మనం చేసిన మంచేమిటో తెలుసన్న ఆయన వైసీపీ అందించిన పాలనను ప్రజలు ఎవరూ మర్చిపోరన్నారు. 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలో భాలు గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ప్రజలు వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని నేతలతో వ్యాఖ్యానిం చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు పోలయ్యాయన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ నేతలకు హితోప దేశం చేశారు జగన్. 2019లో వచ్చిన ఓట్ల కంటే ప్రస్తుతం వచ్చింది కేవలం పదిశాతం మాత్రమే తక్కువని చెప్పుకొచ్చారు. అబద్దాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదన్న విషయాన్నే తాను ఎప్పుడూ చెబుతానని 2014, 2019లో అదే నిజమైందని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వస్తా యంటూ నేతలకు వివరించారు జగన్.
ఈ సందర్భంగానే తన భవిష్యత్ కార్యాచరణపై జగన్ క్లారిటీ ఇచ్చారన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. మనకు వచ్చిన సంఖ్యా బలం తక్కువ. కాబట్టి అసెంబ్లీలో మనం చేసేది తక్కువేనని ఆయన చెప్పడం ఇందులో భాగమేనని అంటున్నారు. పైగా అధికార పక్ష నాయకులు, శ్రేణులు జరిపిన దాడుల్లో గాయప డిన వైసీపీ కార్యకర్తలను రాబోయే రోజుల్లో పరామర్శిస్తానన్నారు. తద్వారా భవిష్యత్లో అసెంబ్లీలో ఉండే కంటే ప్రజాక్షేత్రంలో ఉండడమే మంచిదన్న భావనలో వైసీపీ అధినేత ఉన్నట్లుగా కన్పిస్తోంది. అటు వైసీపీ నేతలు సైతం ఇదే మాట చెబుతున్నారు. టీడీపీ దాడులకు భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. తెలుగు దేశం నేతల దాడుల్లో గాయపడిన ప్రతి వైసీపీ కార్యకర్త కుటుంబం వద్దకు జగన్ వెళ్తారని, ఈ మేరకు తమతో జరిగిన సమావేశంలో చెప్పారన్నారు. ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల కోసం పోరాడుతామంటూ చెప్పుకొచ్చారు కొడాలి నాని. మొత్తంగా గతంలో పాదయాత్ర పేరుతో రోజుల తరబడి ప్రజల మధ్య ఉండి వారి కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన జగన్. మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగానే కన్పిస్తోంది.