పశ్చిమాసియా యుద్ధానికి ఏడాది పూర్తయింది. ఇజ్రాయెల్పై గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. హమాస్ జరిపిన తొలిదాడిలో సుమారు 12 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 250 మందికిపైగా సామాన్య ప్రజలను ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ బందీల్లో 100 మందిని చంపేయడంతో హమాస్పై ఇజ్రాయెల్ ఎదురుదాడితో విరుచుకుపడింది. ముందుగా హమాస్కు పట్టున్న గాజాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. హమాస్ నేతలే టార్గెట్గా ఆపరేషన్ చేపట్టింది.
గతేడాది ఇదే రోజున ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయగా.. ఆ వార్ ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో మొదలైన యుద్ధం.. సరిహద్దులను దాటి ఇరాన్ వరకు విస్తరించి వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ ఇజ్రాయెల్- హమాస్ మారణహోమానికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా విరుచుకుపడింది. లెబనాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇజ్రాయెల్పైకి మిస్సైల్స్, డ్రోన్తో ఎటాక్ చేసింది. దాంతో.. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. హెజ్బొల్లా స్థావరాలపై తొలుత వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్.. భూతల దాడులూ చేస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక.. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడం ప్రకంపనలు రేపింది. ఆయా పరిణామాలతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
నస్రల్లా మరణం వరకు హమాస్, హెజ్బొల్లా సంస్థలకు బ్యాక్ బోన్గా ఉన్న ఇరాన్.. ఇటీవల డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులకు దిగింది. దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఇప్పటికే ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా ఇరాన్పై దాడి జరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అందులోనూ.. నేటితో దాడి జరిగి ఏడాది పూర్తవుతుండడంతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. మొత్తంగా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఏడాది క్రితం మొదలైన మారణహోమం బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది.