బడికి వెళ్లే విద్యార్థుల పరిస్థితి చూస్తే జాలేస్తుంటుంది. చిన్న వయసులో చిట్టి చేతులతో పెద్ద పెద్ద బ్యాగులు మోస్తూ స్కూల్కి వెళ్తుంటారు. ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనిషి కన్నా వారు మోసే బ్యాగు పెద్ద సైజులో ఉంటుంది. అలా మోసుకెళ్లున్న పిల్లలను చూస్తే పాపం వారికి ఈ వయసులోనే ఇన్ని కష్టాలా.. అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ కష్టాలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సెమిస్టర్ల వారీగా అన్నింటిని కలిపి ఒకే టెక్స్ట్ బుక్ తీసుకురాబోతున్నారు. ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురాబోతున్నారు. దీనికి అదనంగా మరో వర్క్బుక్ ఉంటుంది.
ఇక రెండో సెమిస్టర్లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక టెక్ట్స్ బుక్ ఉండబోతుంది. దీనికి అదనంగా ఒక వర్క్బుక్ ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న పలు అంశాలను వెల్లడించారు. అవేంటో ఓ సారి చూద్దాం.
3 నుంచి 5 తరగతులకు మొదటి సెమిస్టర్లో భాష, సబ్జెక్టులు అన్ని కలిపి ఒక పుస్తకం, వర్క్బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం, వర్క్బుక్ ఇస్తారు.
9, 10 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ టెక్ట్స్ బుక్ని తొలగించి, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు.
ఇక పర్మిషన్ తీసుకోకుండా విధులకు రాని టీచర్లకు కూడా కొన్ని కీలక విధానాలను విద్యాశాఖ అమలు చేయబోతుంది.
అనుమతి లేకుండా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు బదిలీల సమయంలో నెలకో పాయింట్ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్ పాయింట్లు ఇస్తారు.
ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. బదిలీల్లో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి.
ఇక వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తే విద్యార్థులకు పెద్ద పెద్ద బ్యాగులు మోయాల్సిన అవసరం ఉండదు.