స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిన్నటి నుంచి కొనసాగుతోంది. నిన్న జరిగిన శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఈ శోభాయాత్ర కోలాహలంగా సాగింది. వేలాది విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇంకా చాలా విగ్రహాలు నిమజ్జనం కోసం వాహనాల్లో వేచి ఉన్నాయి. మరోవైపు నిమజ్జనం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో దాదాపు 40 వేల మంది పోలీసులను మోహరించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. నిమజ్జనం సందర్భంగా ఓ చోట భక్తులతో కలిసి మహిళా పోలీసులు డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. డీజే పాటలకు అనుగుణంగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను బీఆర్ఎస్ నాయకురాలు సామల హేమ ట్విట్టర్ లో షేర్ చేశారు. హైదరాబాద్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు.