అస్సాంలో మరోసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే కీలక నేతలు హాజరయ్యారు.
హిమంత బిశ్వశర్మ వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే అస్సాంలో వరుసగా రెండుసార్లు సీఎం పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా రికార్డు సృష్టించారు. ఆయనతో పాటు మరో నలుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, శాంతిభద్రతలు, పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు హిమంత బిశ్వశర్మ తెలిపారు.
ఇటీవల జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 126 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 102 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.
భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే 82 స్థానాలు దక్కించుకోగా… మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ — AGP, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ — BPF చెరో 10 స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ విజయంతో ఎన్డీయే అస్సాంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఈశాన్య భారతంలో మరింత రాజకీయ బలం చేకూర్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ఎన్డీయే మద్దతుదారులు కార్యక్రమానికి హాజరయ్యారు.


