తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమంలో పాల్గొన్న వారి త్యాగాలు, సేవలకు సరైన గుర్తింపు కల్పించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ ఆర్టీఎం నెం.679ను విడుదల చేసింది.
ఈ కమిటీకి సీనియర్ నేత డా. కె. కేశవరావును చైర్మన్గా నియమించింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రమాణాలను రూపొందించడం, అర్హుల జాబితాను సిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌరవాలు, సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కమిటీ నివేదికను త్వరగా సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.


