టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ పై అసంతృప్తిరాగాలు వినిపిస్తున్నాయి. తొలి జాబితాలో సీటు దక్కనివారు నిరసన వ్యక్తంచేస్తున్నారు. మరో వైపు .. ఇక తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తోన్న నేతలు.. పార్టీకి గుడ్బై చెబుతున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామాను పంపినట్లు తెలుస్తోంది. అలాగే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి గొల్లపల్లి.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఎదుగుదల కోసం సేవలు అందించాలని సూచించారు. ఇదే కార్యక్రమంలో పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరారు. స్టాలిన్ కు కూడా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు.