ఇప్పటికే మరో విడత ఢిల్లీ ఛలో నిరసన మార్చ్ నిర్వహిస్తున్న రైతులు… పంజాబ్, హర్యానాల్లో పలు చోట్ల రైల్రోకో చేపడుతున్నారు. 4 గంటల పాటు రైల్రోకో చేయనున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్తంగా రైల్రోకోకు పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రైల్రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్లపై కూర్చొని నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా సర్వన్ సింగ్ పందేర్ చెప్పారు. రైతులు చేపట్టిన రైల్రోకో కార్యక్రమంతో పంజాబ్, హర్యానాల్లో 60 చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
గత నెలలో రైతులు చేపట్టిన రైల్రోకోల కారణంగా ఢిల్లీ, అమృత్సర్ రూట్లో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు మార్చ్ 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ఢిల్లీ ఛలో ర్యాలీ కొనసాగుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాల జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధర ఇస్తామని ఈ చర్చల్లో కేంద్రం ప్రతిపాదిం చింది. కేంద్రం తీసుకువచ్చిన ప్రతిపాదన రైతులకు నచ్చకపోవడంతో వారు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీని మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో భాగంగా రాస్తారోకోలు, రైల్రోకోలకు పిలుపునిచ్చి దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.