చదువుకునే పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే కష్టం…అహర్నిశలు శ్రమించే రైతన్నలు పొలాలకు వెళ్లాలంటే కష్టం..కాలం చేసిన వారికి కర్మకాండలు చేయాలంటే కష్టం..ఇలా అన్ని కష్టాలకు కారణం ఓ నది. ఇదేమిటి.. నదేమిటి..కష్టాలకు కారణం ఏమిటి..? అనుకుంటున్నారా..అయితే ఆ వివరాల్లోకి వెళదాం..
దేవళాలు, నదీమ తల్లులు, పచ్చని పొలాలు, పాడి పండలతో విరాజిల్లే ఏపీ రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని గుర్తిస్తున్నారు. విశాఖకు కూతవేటు దూరంలో ఉన్న పట్నం భీమునిపట్నం. భీమిలిగా ముద్దుపేరు పొందిన భీమునిపట్నానికి సమీపంలో ఉన్న తాటితూరు పంచాయతీవాసులకు విచిత్ర కష్టం వచ్చిపడింది. ఊరిలో శ్మశానం గోస్తవి నది ఆవలి వైపున ఉంది. మరోవైపు పాఠశాల సైతం ఊరికి దూరంగానే ఉంది. రైతులు వ్యవసాయానికి వెళ్లాలన్నా, గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహనం చేయాలన్నా…ఏ చిన్న పనికైనా నది దాటాల్సిందే. తాటితూరు పంచాయతీలో వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఊరి ప్రజల వ్యవసాయభూములు గోస్తవి నది అవతలి వైపున వున్నాయి. ఇక చిట్టిపొట్టి చిన్నారులు చక్కగా చదువులు సాగిస్తున్నా…పాఠశాలకు వెళ్లాలంటే నది దాటాల్సివ స్తోంది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైతే చిన్నారుల కష్టాలు వర్ణనాతీతం. ప్రవాహం ఎక్కువైతే మెడలోతు వరకు నీళ్లు వచ్చేస్తాయి. మిగిలిన సీజన్లలో సైతం నడుములోతును నీటిని దాటుకుంటూ పిల్లలు స్కూళ్లకు వెళుతూంటారు. వర్షాకాలం వస్తే.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని పిల్లల తల్లిదం డ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు.
గ్రామంలో ఎవరైనా మరణిస్తే… ఆ మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లాలన్నా నది దాటాల్సిందే. మృతదేహాలు తీసుకెళ్లే సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కొందరు వ్యక్తులు విగతజీవులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. చిన్నపిల్లలు నదిలో కొట్టుకుపోయిన సందర్బాలు సైతం ఎన్నో ఉన్నాయి. వంతెన నిర్మాణం విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే..కనీసం కాజ్ వే నిర్మించేందుకు సైతం అధికారులు చొరవ చూపించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు, పొలాలకు వెళ్లిన రైతులు..తిరిగి ఇంటికి వచ్చే వరకు వారి కుటుంబీకులు బిక్కు బిక్కు మంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. నదీ ప్రవాహం ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడుతున్నారు.