విశాఖ మహానగరంలో మరోసారి వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగించింది. పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా సామూహికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
జీవీఎంసీ 86వ వార్డు పరిధిలోని వుడా ఫేజ్-2 ప్రాంతంలో నివాసం ఉంటున్న జాయూస్ స్థానిక ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మోక్షరాజు (4) ఉన్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం సమయంలో ఇద్దరు అక్కలు నిద్రిస్తుండగా, మోక్షరాజు ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకోవడానికి వెళ్లాడు.
అక్కడ ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేసి ఒళ్లంతా గాయపరిచాయి. అంతేకాకుండా బాలుడి చెవిని కూడా కొరికేశాయి. తీవ్ర నొప్పితో చిన్నారి పెద్దగా ఏడవడంతో అక్కడి స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి బాలుడిని రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న తల్లి హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాంతంలో వీధి కుక్కల సంఖ్య పెరిగిపోయిందని, పిల్లలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


