కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా… కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించలేదు. 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించిన యూడీఎఫ్లో సీఎం పదవిపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.
ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేత పేరును ప్రకటించనున్నారు. సాధారణంగా శాసనసభ పక్ష నేతనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం సీఎం రేసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్, ప్రతిపక్ష నేత వీ.డి. సతీశన్ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా రేస్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం… 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 47 మంది కే.సీ. వేణుగోపాల్కు మద్దతుగా ఉన్నారు. వీ.డి. సతీశన్కు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని తెలుస్తోంది. పరిపాలనా అనుభవం ఎక్కువగా ఉండటంతో వేణుగోపాల్కే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అయితే యూడీఎఫ్లో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) మాత్రం వీ.డి. సతీశన్కు మద్దతు ఇస్తోంది. వామపక్ష కూటమి అయిన ఎల్డీఎఫ్ను ఓడించడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారని, ప్రజల్లో కూడా ఆయనకే మద్దతు ఉందని ఐయూఎంఎల్ భావిస్తోంది.
కాంగ్రెస్కు 63 సీట్లు ఉండగా… ఐయూఎంఎల్కు 22 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐయూఎంఎల్ అసంతృప్తికి గురైతే ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఐయూఎంఎల్ అభిప్రాయానికి కాంగ్రెస్ లొంగితే… బీజేపీ నుంచి “ముస్లిం మద్దతు కోసం రాజీ” అనే విమర్శలు వచ్చే అవకాశముంది. అంతేకాదు, వేణుగోపాల్-సతీశన్ వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితి కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరును గుర్తు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వయనాడ్లో ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. “సతీశన్ను పక్కనబెట్టి వేణుగోపాల్ను ఎంపిక చేస్తే వయనాడ్ కూడా అమేథీలా మారుతుంది” అంటూ పోస్టర్లలో హెచ్చరికలు కనిపించాయి.

వయనాడ్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఐయూఎంఎల్ను అసంతృప్తికి గురి చేయడం కాంగ్రెస్కు రిస్క్గా మారింది.
కాంగ్రెస్ అధిష్ఠానం వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ… సతీశన్ వర్గం మాత్రం సీఎం పదవిపైనే పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ చెన్నితలకు స్పీకర్ పదవి ఇచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.


