పోలవరం ప్రాజెక్ట్ పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూలు విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రం వాల్ పనుల వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు.
పోలవరానికి కేంద్రం నుంచి రూ. 15 వేల కోట్లు నిధులు రావడంతో త్వరిత గతిన ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది కూటమి సర్కార్. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతినెలా ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి, పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు.
2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. డయాఫ్రంవాల్ నిర్మాణంతోపాటు ఎర్త్కం రాక్ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంగిన గైడ్బండ్ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు.
సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. దీంతో కాలనీలు అసంపూర్తిగా నిలిచాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. వీరికోసం ఒక్క ప్రాంతంలోనూ పూర్తిస్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు.