సీసీఎస్ ఎసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది. భారీ సంఖ్యలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు వద్దకు న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించాడు. ఆయన వ్యవహారశైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. అతనిపై ఇప్పటికే మూడు సార్లు సస్పెన్షన్ వేటుసైతం పడింది. అయినా ఉమామహేశ్వరరావు తనతీరు మార్చుకోలేదు.
సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను ఉమామహేశ్వరరావు జేబులో వేసుకున్నాడు. సీసీఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉoటూ వారితోనే బేరసారాలు సాగించాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్నారైను సైతం బెదిరించి డబ్బులు దండుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఉమా మహేశ్వర రావు బూతుపురాణంపైనా సిబ్బంది పలుసార్లు అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బందిని సైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. తన దగ్గరికి వచ్చిన ప్రతి కేసులోను ఉమా మహేశ్వరరావు చేతివాటం ప్రదర్శించేవాడని ఫిర్యాదులు ఉన్నాయి. అక్రమ ఆస్తులను కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలను ఉమామహేశ్వ రరావు కొనుగోలు చేశారు. తన ఇంట్లో నగదు ఉంచకుండా, తన అత్త, మామల ఇంట్లో డబ్బును ఉంచారు. ఈ అవినీతి తిమింగలం లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్ లో రాసుకున్నాడు. ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో 50కోట్ల మేర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉంటే ఏసీబీ అధికారులు ఉమామహేశ్వర రావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. ఆదాయానికి మించి ఆస్తులను కలిగిఉన్నాడనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమాహేశ్వరరావు ఇంటితోపాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. మొత్తం 3కోట్ల 45లక్షల ఆస్తులను అధికారులు గుర్తించారు. సోదాలు పూర్తయ్యాక ఉమాహేశ్వరరావును అరెస్టు చేశారు.


