లోక్సభ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగలడంతో లోక్సభలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు రెస్ట్ మోడ్లో ఉన్న కేసీఆర్ ఇ ప్పుడు ఎంపీ అభ్యర్థుల ను ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే నలుగురు అభ్యర్థులను ప్రకటించారు.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 9 మందితో తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. అటు అధికార కాంగ్రెస్ కూడా త్వరలో జాబితా విడుదల చేసేందకు కసరత్తు చేస్తోంది. ఇక ఇన్నాళ్లూ రెస్ట్ మోడ్లో ఉన్న కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున నలుగురి లోక్ సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితను లోక్సభ బరిలో నిలుస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. అయితే వీటిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 13 లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరెవరికి చోటు దక్కుతందనే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో 9 లోకసభ స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో నేతలు ఇతర పార్టీలపై చూస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతు కవిత పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ తొలి లిస్టులోనే నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత పేర్లను బీఆర్ఎస్ ప్రకటించడం గమనార్హం.
మహబూబాబాద్ పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. అయితే దశాబ్దకాలంగా అక్కడ కారు దూసుకుపోయింది. ప్రస్తుతం మాలోతు కవిత ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014లో గెలిచిన సీతారాం నాయక్ను కాదని, 2019లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ మారుతారనే ప్రచారం మధ్య మళ్లీ మాలోతు కవితకే మహబూబాబాద్ సీటును కట్టిబెట్టారు.మొత్తానికి లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ లోక్సభ ఎన్నిక లకు రెడీ అవుతుంటే..మోదీ ఫేవరెట్గా 17 ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ ఉత్సాహంగా ముందుకు కదులు తోంది. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి కోలుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.