ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో అవలంబిస్తున్న వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపై ఆయన ఇంకా పూర్తి గందరగోళంలోనే ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొదట ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆయన, ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ‘మావిగన్’ అనే సరికొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చారు. కానీ తాజాగా మళ్లీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కే తమ మద్దతు అని ప్రకటించారు. పదే పదే మారుతున్న ఈ ప్రకటనల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నాయకులే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల వల్లే గత ఎన్నికల్లో విద్యావంతులు, తటస్థ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేశారన్న నగ్నసత్యాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
తాడేపల్లిలో నిర్వహించిన తాజా మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని అంశాన్ని మరింత జటిలం చేశాయి. ఒకే వేదికపై నుంచి ఆయన ఏకకాలంలో మూడు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒకవైపు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అభివృద్ధి చేయాలన్న పాత విధానానికే తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అమరావతి రైతుల పట్ల తమకు ఎలాంటి వ్యతిరేక భావన లేదని, వారికి న్యాయం చేయాలన్నదే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అకస్మాత్తుగా సానుభూతి వచనాలు పలికారు. ఈ రెండు మాటలకు పొంతన లేకుండా, భవిష్యత్తు రాజధానిగా మావిగన్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే మూడు భిన్నమైన వైఖరులు ప్రదర్శిస్తున్న జగన్ను చూస్తుంటే, అపరిచితుడు తరహా బహుముఖ ఆలోచనా ధోరణి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక స్పష్టమైన విధానం లేకుండా, ఒకేసారి మూడు ప్రాంతాల పేర్లు చెబుతూ జగన్ మాట్లాడుతున్న తీరుకు అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులు సైతం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఎన్నికల ఎజెండాను కూడా ఆవిష్కరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాన నినాదం అమరావతి వర్సెస్ మావిగన్గా ఉండబోతోందని ఆయన తేల్చి చెప్పారు. రాజధాని ప్రాంతాన్ని కేవలం ఒకే చోట కేంద్రీకరించకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల పరిధిని కలుపుతూ మావిగన్ పేరుతో ఒక బృహత్తర ప్రాజెక్టును తమ పార్టీ అజెండాగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ప్రకటించారు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద లాజికల్ సమస్య ఉత్పన్నమవుతోంది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఉంచుతామని చెబుతూనే.. మళ్లీ అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ తీసుకువస్తామని చెప్పడం ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు విశాఖ మంత్రం పఠిస్తూనే, మరోవైపు మావిగన్ పల్లవి అందుకోవడం ఏ రకమైన రాజకీయ వ్యూహమో ఎవరికీ అంతుబట్టడం లేదు. రెండు విభిన్నమైన ప్రాంతాలను ఒకేసారి రాజకీయ అస్త్రాలుగా వాడుకోవాలన్న వైసీపీ ప్లాన్ క్షేత్రస్థాయిలో పూర్తిగా బెడిసికొట్టే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
రాజకీయాల్లో ప్రతికూల అంశాలు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపినప్పుడు, నాయకులు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అత్యంత సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ప్రాథమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసి, ఏకంగా ముప్పై వేల మంది రైతులకు బద్ధ శత్రువుగా మారిపోయారు. ఆ నిర్ణయం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజికంగా, రాజకీయంగా కోలుకోలేని దెబ్బతింది. కనీసం తాము రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నినాదాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు. ఆ పేరుతో ఓట్లు అడిగిన వైసీపీని ఉత్తరాంధ్ర ఓటర్లు కనీస స్థాయిలో కూడా ఆదరించలేదు. ఎన్నికల్లో అన్ని ప్రాంతాల ప్రజలు రాజధాని వికేంద్రీకరణను మూకుమ్మడిగా తిరస్కరించిన తర్వాత కూడా.. ఇప్పుడు కొత్తగా మావిగన్ పేరుతో జగన్ చేస్తున్న ప్రయోగం అటు విజయవాడ, ఇటు గుంటూరు, మచిలీపట్నం ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది.
ఒక ప్రతిపక్ష నేతగా రాజధాని లాంటి అత్యంత కీలకమైన పాలసీ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మరింత నష్టం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అసలే ఘోర పరాజయంతో డీలా పడిన పార్టీ శ్రేణులకు.. అధినేత పదే పదే మారుస్తున్న ఈ స్టాండ్ ఆత్మరక్షణలో పడేస్తోంది. ఒకవైపు తాము విశాఖ రాజధానిగా పోరాటం చేయాలా? లేక కొత్తగా తెరపైకి వచ్చిన మావిగన్ అజెండాను భుజాన వేసుకోవాలా? అన్నది క్షేత్రస్థాయి నాయకులకు ఏమాత్రం అర్థం కావడం లేదు. స్థిరత్వం లేని విధానాల వల్ల పార్టీకి ఇప్పటికే దూరమైన విద్యావంతులు, తటస్థ ఓటర్లు మరింతగా ముఖం చాటేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఒకే రాజధానితో అభివృద్ధిని ఆకాంక్షిస్తుంటే.. జగన్ మాత్రం విశాఖ, మావిగన్ అనే పదాలతో మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఏది ఏమైనా పూటకో మాట, రోజుకో రాజధాని ప్రతిపాదన చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. మరి ఈ విషయాన్ని జగన్, ఆ పార్టీ నేతలు ఎప్పుడు గ్రహిస్తారో చూడాలి.


