సీఎం టూర్‌కు దూరంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. మళ్లీ కిరికిరి

కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy) పర్యటన రాజకీయంగా కాక రేపింది. సీఎం పర్యటనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మరియు కింది స్థాయి కేడర్ అంతా భారీ ఎత్తున తరలివచ్చారు. కానీ ఒక్క మునుగోడు(munugodu) నియోజకవర్గం నుంచి మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు. మునుగోడు కాంగ్రెస్ శ్రేణులు కనీసం నల్లగొండ(nalgonda) వైపు అడుగు కూడా వేయలేదు. నిత్యం నియోజకవర్గంలో తన అనుచరులకు, ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komati reddy rajagopal reddy).. సీఎం పర్యటన రోజున పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆయన నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో మునుగోడు కేడర్ అంతా సైలెంట్‌గా ఉండిపోయింది. గతంలో రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చిన సమయంలోనూ రాజగోపాల్ రెడ్డి ఇలాగే వ్యూహాత్మక దూరం పాటించడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి సీఎం పర్యటనను పూర్తిగా బహిష్కరించడానికి క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీ. కానీ నల్లగొండలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. సీఎం సభకు ముందే మునుగోడు నియోజకవర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరులను, స్థానిక కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇళ్ల వద్దే హౌస్ అరెస్టులు చేయడం అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన నాయకులనే ఇలా ముందస్తు అరెస్టులు చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాక కేడర్ విస్మయానికి గురైంది. ఈ చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి కనీసం జిల్లా సరిహద్దుల్లోకి కూడా అడుగుపెట్టకుండా తన నిరసనను గట్టిగా తెలియజేశారు. తన అనుచరుల అరెస్టులకు నిరసనగానే ఆయన సీఎం సభను బహిష్కరించి పరోక్ష కౌంటర్ ఇచ్చారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మునుగోడు ఎమ్మెల్యేలో గూడుకట్టుకున్న ఈ అసంతృప్తికి కేవలం తాజా పరిణామాలు మాత్రమే కాకుండా, బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే వయసులో, రాజకీయ అనుభవంలో తానే సీనియర్ అనే భావన రాజగోపాల్ రెడ్డిలో బలంగా నాటుకుపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి రేసులో ఉంటానని ఆయన గట్టిగా విశ్వసించారు. కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపడం ఆయనకు తొలి షాక్‌గా మారింది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కినప్పటికీ.. తనకు కనీసం కేబినెట్‌లో అవకాశం రాకపోవడం ఈ అసంతృప్తిని మరింత పెంచింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలిసినా, ఇప్పట్లో ఎలాంటి మంత్రివర్గ విస్తరణ ఉండబోదని స్పష్టత రావడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. దీనికి తోడు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సైతం ఆయన దూరంగా ఉండటం ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్‌ను మరింత స్పష్టం చేసింది.

ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసించిన ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ బ్రాండ్ ఇప్పుడు భిన్న దారుల్లోకి పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో అత్యంత యాక్టివ్‌గా పాల్గొంటుంటే.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అన్న ఒక దారి, తమ్ముడు మరో దారి అన్నట్లుగా సాగుతున్న వీరి రాజకీయ వ్యూహాలతో ఉమ్మడి జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అయోమయంలో పడింది. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏమాత్రం మింగుడుపడటం లేదు. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. తాజాగా కేసీఆర్ ఒక పెద్ద ఉద్యమకారుడని, ఆయన్ను స్వయానా కూతురు కవిత కూడా సరిగ్గా గౌరవించలేకపోయిందంటూ అనూహ్య ప్రశంసలు కురిపించడం పొలిటికల్ హీట్ పెంచింది. కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గితే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ వైపు వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నారా, లేక హైకమాండ్‌పై ఒత్తిడి పెంచడానికే ఈ వ్యూహం అమలు చేస్తున్నారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

రాజగోపాల్ రెడ్డి గత రాజకీయ ట్రాక్ రికార్డును గమనిస్తున్న మునుగోడు శ్రేణుల్లో ఆయన తాజా వైఖరి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి, మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి సొంత గూటికి చేరుకుని, మునుగోడు నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఒంటరి పోరాట వైఖరిని ప్రదర్శిస్తూ సీఎం సభలను బహిష్కరిస్తుండటంతో కేడర్‌లో టెన్షన్ మొదలైంది. అసలు తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా ఉంటారా, లేక మళ్లీ రాజకీయ రూట్ మారుస్తున్నారా అనే సందిగ్ధత మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలను వెంటాడుతోంది. భవిష్యత్ కార్యాచరణపై తమ నాయకుడు స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో అటు ద్వితీయ శ్రేణి నాయకులు, ఇటు కార్యకర్తలు కూడా ఏం చేయాలో పాలుపోక పూర్తిగా స్తబ్దుగా ఉండిపోవాల్సి వస్తోంది. పార్టీ పెద్దలు ఈ వ్యవహారాన్ని వెంటనే చక్కదిద్దకపోతే మునుగోడు కాంగ్రెస్‌లో సంస్థాగత సంక్షోభం రావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

టీడీపీలో సరికొత్తగా నారీ శకానికి నాంది

తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన మహిళా సాధికారత వ్యూహానికి మహానాడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్