అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్( Central Park)లో విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బండి అదుపు తప్పడంతో బండి నుంచి కిందపడిన తన తల్లిని కాపాడే ప్రయత్నంలో భారతీయ యువకుడు రోమాంచ్ మహాజన్ (18) ప్రాణాలు కోల్పోయాడు. రోమంచ్ మహాజన్ (Romanch Mahajan) తన కుటుంబంతో కలిసి తొలిసారిగా న్యూయార్క్ పర్యటనకు వెళ్లిన సమయంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది.
కుటుంబ సభ్యుల ఫొటో తీసేందుకు బండి డ్రైవర్ ఆగిన సమయంలో ఒక్కసారిగా గుర్రం అదుపు తప్పి పరుగులు పెట్టింది. అది ఫుట్పాత్పైకి దూసుకెళ్లి, గడ్డిపైకి ఎక్కి వేగంగా పరిగెత్తింది.. డ్రైవర్ దాని వెనుక పరుగెత్తినా అదుపు చేయలేకపోయాడు.
ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నించారు. అయితే రోమాంచ్ తల్లి ప్రియా మహజన్( Priya Mahajan) బండి నుంచి కిందపడిపోయారు. ఆమెను కాపాడేందుకు రోమాంచ్ వెంటనే బండి నుంచి దూకి సహాయం చేసేందుకు ప్రయత్నించగా, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈఘటనలో తల్లి, తండ్రి, రోమాంచ్ తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


