హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ లొంగిపోయాడు. బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.
కొద్ది రోజులుగా భగీరథ్పై వచ్చిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపైనే పడింది. ఈ నేపథ్యంలో భగీరథ్ ఎక్కడున్నాడు..? ఎప్పుడు విచారణకు హాజరవుతాడు..? అనే చర్చలు కొనసాగుతుండగానే శనివారం ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకోవడం సంచలనంగా మారింది.
ఇక ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “చట్టం ముందు అందరూ సమానమే. నా కుమారుడైనా చట్టానికి లోబడాల్సిందే” అంటూ స్పష్టం చేశారు. భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదని తాము నమ్ముతున్నామని, కానీ చట్ట ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించినప్పటికీ, ముందుగా న్యాయవాదులను సంప్రదించామని తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలను లాయర్లు పరిశీలించారని, కేసు బలహీనంగా ఉందని, బెయిల్ వచ్చే అవకాశం ఉందని వారు చెప్పినట్లు వెల్లడించారు. అందుకే కొంత ఆలస్యం జరిగిందన్నారు.
అయితే, “ఇంకా ఆలస్యం చేయడం సరికాదు” అన్న ఉద్దేశంతో స్వయంగా భగీరథ్ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, నిజం తప్పకుండా బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పోలీసులు భగీరథ్ను విచారిస్తున్నారు. కేసులో తదుపరి ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.


