నిమ్స్లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్ని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షల మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్న హాస్పిటల్పై బురదజల్లే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి నిమ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకున్నట్టు ఒక పేషెంట్ నుంచి ఫిర్యాదు వచ్చిందని బీరప్ప వెల్లడించారు. ఈ అంశంపై పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.
ప్రాథమిక విచారణ అనంతరం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించామని చెప్పారు. ఈ అంశంలో ఇంకెవరి పాత్ర అయినా ఉన్నట్టు తేలితే, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని ప్రచారం చేసి నిమ్స్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇలాంటి వారు సృష్టించే అపోహలు, దురుద్దేశపూరిత ప్రచారం పట్ల మీడియా మిత్రులు అప్రత్తంగా ఉండాలని బీరప్ప విజ్ఞప్తి చేశారు.


