తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పారిపోవడంపై స్పందించారు. నిందితుడు తప్పించుకోవడం సరైన చర్య కాదని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నైతిక బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు. అలా చేస్తే ఆయన గౌరవం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదని సీఎం వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కష్టపడి రాజకీయంగా ఎదిగారని, ఇప్పుడు కుమారుడి వ్యవహారం కారణంగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు.
తప్పు చేసినా, చేయకపోయినా చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే కుమారుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు. ఈ కేసులో ఎవరి తప్పు ఉందో దర్యాప్తు అధికారులు విచారణలో తేలుస్తారని స్పష్టం చేశారు.


