నీట్ (NEET-UG 2026) పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శుభమ్ ఖైర్నార్( Shubham Khairnar) వాట్సాప్ చాట్లో సంచలన విషయాలను బయటపెట్టాయి. అభ్యర్థులకు 500 నుంచి 600 మార్కులు వస్తాయని గ్యారంటీ ఇస్తూ భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.
మే 3న నిర్వహించిన NEET-UG పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసి జూన్ 21కు రీ ఎగ్జామ్ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐకి( Central Bureau of Investigation) కీలక ఆధారాలు లభించాయి.
దర్యాప్తు ప్రకారం, ఏప్రిల్ నెలలోనే శుభమ్ ఖైర్నార్ తన సప్లయర్ పుణెకు చెందిన యశ్ యాదవ్( Yash Yadav) ప్రశ్నాపత్రం కోసం సంప్రదించినట్లు తెలిసింది. ఏప్రిల్ 29 నాటికి పేపర్ లీక్ ఒప్పందం ఖరారైనట్లు అధికారులు గుర్తించారు.
ఆ తర్వాత ఖైర్నార్ , అతని సహచరులు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని, NEETలో మంచి మార్కులు తెప్పిస్తామని చెబుతూ అభ్యర్థులను వలలో వేసినట్లు సమాచారం. వాట్సాప్ చాట్లలో “500 నుంచి 600 మార్కులు ఖాయం” అంటూ హామీలు ఇచ్చినట్లు సీబీఐ గుర్తించింది. కాగా నీట్ ( NEET-UG) పరీక్ష మొత్తం 720 మార్కులకు నిర్వహిస్తారు.
శుభమ్ మొబైల్ ఫోన్ నుంచి లీకైన ప్రశ్నాపత్రాలు, వాట్సాప్ చాట్లు, ఇతర డిజిటల్ ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. పేపర్ లీక్ మహారాష్ట్ర నుంచి హర్యానా, రాజస్థాన్లోని జైపూర్, సికార్, జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళ తదితర రాష్ట్రాలకు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.
శుభమ్ ఖైర్నార్ ఎవరు?
నాసిక్లోని ఇందిరానగర్కు చెందిన 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ( BAMS) విద్యార్థి. పుణెకు చెందిన మరో నిందితుడి నుంచి రూ.10 లక్షలకు లీకైన ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసి, హర్యానాకు చెందిన వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో రూ.5 లక్షల లాభం పొందినట్లు అధికారులు చెబుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్తున్న సమయంలో సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తప్పించుకునేందుకు జుట్టు కత్తిరించి తన రూపాన్ని మార్చుకున్నప్పటికీ, పాత ఫొటోలు , సాంకేతిక నిఘా ఆధారంగా అధికారులు శుభమ్ని గుర్తించినట్లు సమాచారం.


