37.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

మోదీ పర్యటన తర్వాత కేసీఆర్ అప్రమత్తం అయ్యారా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగంగానే తమతో కలవాలని బంపర్ ఆఫర్ ఇవ్వడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే బలోపేతంపై వ్యూహాలు రచించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని పర్యటనతో అటు ఏపీలో వైసీపీ, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మోడీ తేల్చి చెప్పడంతో గులాబీ బాస్ కేసీఆర్ వెంటనే అలెర్ట్ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సీనియర్లతో ఏకంగా ఆరు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపి పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి పట్టిన గతే తమకు పడుతుందన్న ఆందోళన ప్రాంతీయ పార్టీల్లో మొదలైందా? మోడీ స్కెచ్ ను ఎదుర్కొనేందుకు కేసీఆర్ వేస్తున్న ఆ సరికొత్త వ్యూహం ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో గడిపిన సగం రోజు పర్యటన అనూహ్యమైన రాజకీయ కలకలానికి దారితీసింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే మోడీ బంపర్ ఆఫర్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాతో కలిసి రండి అంటూ ప్రధాని ఇచ్చిన ఆఫర్ పై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా మోడీ తన మిత్రపక్షాలతో లోతైన చర్చలు జరిపారు. ఈ పరిణామాలతో అటు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ, ఇటు తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. జాతీయ స్థాయిలో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను గమనించిన ప్రాంతీయ పార్టీలు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తమ ఉనికికే ప్రమాదమని గ్రహించి, తక్షణమే తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునే పనిలో పడిపోయాయి.

మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వెంటనే యాక్షన్ మోడ్ లోకి దిగారు. తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మీటింగ్ ఏకంగా ఆరు గంటల పాటు అత్యంత సీరియస్ వాతావరణంలో సాగింది. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కొత్త రూపంతో, సరికొత్త షేపుతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సీనియర్లకు గట్టిగా దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేపట్టాలని ఈ సుదీర్ఘ సమావేశంలో ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. కేవలం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీదే కాకుండా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా నాయకులతో కేసీఆర్ అత్యంత లోతుగా చర్చించారు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని సూచించారు.

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం గతానికి భిన్నంగా, అత్యంత వేగంగా మారుతోందని బీఆర్ఎస్ పెద్దలు గ్రహించారు. బహిరంగ సభలో ప్రధాని మోడీ.. రాబోయేది కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే అని అత్యంత ధీమాగా చెప్పడం గులాబీ శ్రేణులను ఆలోచనలో పడేసింది. తెలంగాణలో అధికారం దక్కించుకోవడంపై కమలనాథులు ఎంత పట్టుదలతో ఉన్నారో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. సాధారణంగా బీజేపీ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను చాలా ముందుగానే పకడ్బందీగా సిద్ధం చేస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. అసలు ఓటమే లేదు, ఆమెను ఎవరూ ఓడించలేరు అనుకున్న బలమైన నాయకురాలు మమతా బెనర్జీ సైతం బెంగాల్ లో బీజేపీ వ్యూహాల ముందు ఘోరంగా ఓటమి పాలు కాక తప్పలేదు. మమత లాంటి బలమైన ప్రాంతీయ నేతకే ఓటమి తప్పనప్పుడు, తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ప్రాంతీయ పార్టీల్లో సహజంగానే మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అప్రమత్తమై, గ్రామ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేసే పనికి ఉపక్రమించింది.

రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం పటిష్టమైన చర్యలను వేగవంతం చేసింది. పార్టీ పునాదులను బలోపేతం చేసే క్రమంలో బూత్ లెవెల్ నుంచి, గ్రామ.. వార్డు స్థాయి నుంచి నూతన కమిటీలను పూర్తి స్థాయిలో నింపాలని అధిష్టానం నిర్ణయించింది. క్షేత్ర స్థాయి మొదలుకుని నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు అత్యంత బలమైన, సమర్థులైన నాయకత్వాన్ని తీసుకువచ్చి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయనున్నారు. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇకపై నాయకులంతా కేవలం పార్టీ ఆఫీసులకే పరిమితం కాకుండా, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని, తద్వారా బీఆర్ఎస్ పార్టీని తిరిగి పరుగులు పెట్టించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ బలంగా ఉంటేనే జాతీయ పార్టీల దూకుడును అడ్డుకోగలమని కేసీఆర్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా స్పష్టం చేశారు.

సంస్థాగత ప్రక్షాళనతో పాటు రాబోయే ఎన్నికల లక్ష్యాలపై కూడా బీఆర్ఎస్ నాయకత్వం సుదీర్ఘంగా చర్చించింది. అతి త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో సహా, ఏ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా అందులో విజయమే పరమావధిగా పార్టీ శ్రేణులు పోరాడాలని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో రెడీ అని ప్రధాని మోడీ తన పర్యటన ద్వారా కచ్చితమైన సంకేతాలు పంపి వెళ్లారు. బీజేపీ విసిరిన ఈ పరోక్ష సవాల్ ను స్వీకరించిన గులాబీ పార్టీ, ఇప్పుడు తమ రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఆపరేషన్ తెలంగాణను కమలనాథులు వేగవంతం చేసిన వేళ, ఇక ఉపేక్షిస్తే లాభం లేదని బీఆర్ఎస్ గ్రహించింది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో స్పీడ్ పెంచింది. రానున్న రోజుల్లో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ వ్యూహాల అమలులో బీఆర్ఎస్ స్పీడ్ ఏ స్థాయిలో ఉండబోతోంది అన్నది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది.

Latest Articles

ఆదాయార్జనశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి కేంద్రంగా రాష్ట్ర ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం, ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనపై వివిధ శాఖలకు కీలక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్