దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను అలవాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ఇచ్చిన ఇంధన, ఖర్చుల నియంత్రణ సందేశంపై రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది.
‘నా దేశం – నా బాధ్యత’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పొదుపు చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు కాన్వాయ్లను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా… ఇతర ఖర్చులను కూడా నియంత్రించాలని సూచించారు. జిల్లా పర్యటనలు, విదేశీ టూర్ల ఖర్చులను తగ్గించి… అవసరమైన చోట వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వ శాఖలన్నీ విద్యుత్, ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్య మాత్రమే నడపాలని సూచించారు.
అలాగే వర్క్ ఫ్రం హోమ్ విధానంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని భారీ స్థాయిలో పెంచాలని కూడా చెప్పారు.
“దేశం మనకు ఎంతో ఇచ్చింది… ఇప్పుడు దేశానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని, ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో జాగ్రత్త పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ… పొదుపు చర్యలను దశలవారీగా అమలు చేయాలని సూచించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ… ప్రతి నిర్ణయానికి ముందు ప్రజలను సిద్ధం చేసి తర్వాతే ప్రకటనలు చేయాలని పేర్కొన్నారు.


