విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం( Sri Varaha Lakshmi Narasimha Swamy Temple)సింహాచలం దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో చోరీ యత్నం వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదును లెక్కిస్తున్న సమయంలో ఓ వ్యక్తి డబ్బు కాజేయడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వచ్ఛంద సేవకుడిగా పాల్గొన్న బి. రాంబాబు (79) అనే వ్యక్తి, లెక్కింపు సమయంలో అత్యంత తెలివిగా రూ.17,100 నగదును దాచుకుని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
అయితే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి అతని కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఆ సమయంలో అతని వద్ద నుంచి నగదు బయటపడింది. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
పట్టుబడ్డ వ్యక్తి శ్రీహరి సేవా సంఘం తరఫున స్వచ్ఛంద సేవకుడిగా హుండీ లెక్కింపులో పాల్గొన్నట్లు సమాచారం. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, నిందితుడిని నగదుతో సహా గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు.
ఇటీవలి కాలంలో దేవస్థాన భద్రతా వ్యవస్థలో లోపాలు బయటపడుతున్నాయని, హుండీ లెక్కింపు ప్రక్రియలో మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.


