నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసనగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లోక్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్( Gellu Srinivas Yadav) నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఘటనగా ఆయన అభివర్ణించారు.
పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ (NTA) పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు చివరకు దక్కింది పేపర్ లీక్ మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారాయని ఆరోపించిన ఆయన.. గతంలో 2021 , 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనల నుంచి NTA ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.
2024లో జరిగిన నీట్ లీక్ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమించిన కే రాధాకృష్ణన్ కమిటీ ఆన్లైన్లో పరీక్ష నిర్వహించాలని సూచించినప్పటికీ, ఆ సిఫార్సులను అమలు చేయలేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. “సిఫార్సులను అమలు చేయకపోతే కమిటీ ఎందుకు వేశారు?” అని ప్రశ్నించారు.
పేపర్ లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్( Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను లాభాల కోసం ఉపయోగించే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీక్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే వెంటనే కొత్త పరీక్ష తేదీలు ప్రకటించి, అకడమిక్ క్యాలెండర్కు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.


