ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్లో ఉపయోగించే వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాల్లో మితవ్యయం పాటించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కు కూడా మోదీ ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అయితే కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా ప్రస్తుతం ఉన్న వాహనాలనే ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం.
భద్రతా ప్రమాణాలకు భంగం కలగకుండా ‘బ్లూ బుక్’ మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులను అమలు చేయాలని SPG చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలు
ప్రధాని నిర్ణయాన్ని అనుసరిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మితవ్యయ చర్యలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta), రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ (Bhajan Lal Sharma), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) లు కూడా తమ అధికారిక కాన్వాయ్లలో వాహనాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇంధన సంక్షోభం నేపథ్యంలో పిలుపు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
“ప్రతి అవసరానికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?” అంటూ ప్రజలను ఆలోచింపజేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడటం దేశభక్తి అని పేర్కొంటూ, అవసరం లేని బంగారం కొనుగోళ్లు కనీసం ఏడాది పాటు తగ్గించాలని సూచించారు.
అలాగే విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్లను తగ్గించి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే పర్యటనలు, వేడుకలు నిర్వహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


