తెలుగు సినిమా పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేస్తూ… పరిశ్రమ భవిష్యత్తు కోసం పర్సంటేజీ షేరింగ్ విధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు సహకరించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న రెంట్ లేదా ఫిక్స్డ్ రెంటల్ విధానం సింగిల్ స్క్రీన్లకు భారంగా మారిందని పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి పర్సంటేజీ షేరింగ్ విధానం అమలు చేయకపోతే సింగిల్ స్క్రీన్ల మనుగడ కష్టమవుతుందని అసోసియేషన్ హెచ్చరించింది.
ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు నిర్మాతలు పర్సంటేజీ విధానాన్ని అంగీకరిస్తున్నారని… పెద్ద సినిమాలు విడుదలయ్యే మరో 10 వారాల్లో కూడా అదే విధానాన్ని కొనసాగించాలని కోరింది.
ఇప్పటి ప్రేక్షకుల అలవాట్లు పూర్తిగా మారిపోయాయని… సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడటం లేదని అసోసియేషన్ పేర్కొంది. గతంలో ‘ఎఫ్2’ వంటి సినిమాలు ఎనిమిది వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమయ్యాయని… కానీ ఇప్పుడు భారీ సినిమాలు కూడా తక్కువ రోజుల్లోనే తమ రన్ ముగిస్తున్నాయని తెలిపింది.
ఇక పర్సంటేజీ షేరింగ్ విధానం వల్ల ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్లు లాభపడుతున్నాయని… ‘పుష్ప’ వంటి భారీ సినిమాలను ఇతర రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో కూడా ఇదే విధానంలో ప్రదర్శించారని పేర్కొంది.
కొవిడ్కు ముందు అమలులో ఉన్న రెంటల్ విధానాన్ని ఇప్పటికీ కొనసాగించడం వల్ల థియేటర్ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రిస్క్, రివార్డ్ను నిర్మాతలు, థియేటర్లు సమానంగా పంచుకుంటేనే పరిశ్రమ ఆరోగ్యంగా ముందుకు సాగుతుందని అసోసియేషన్ అభిప్రాయపడింది.


