35.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.. అదే సమయంలో వంటనూనె వినియోగాన్ని కూడా తగ్గించాలని కోరడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. బంగారం, ఇంధనం దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న విషయం సులభంగా అర్థమవుతుంది. కానీ ప్రతి ఇంట్లో నిత్యావసరంగా ఉపయోగించే వంటనూనె విషయంలో ఎందుకు ఇలా పిలుపునిచ్చారన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

వాస్తవానికి భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. అంటే కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం కేవలం వంటనూనె కోసం దేశం బయటకు వెళ్తోంది. ఈ దిగుమతులను తగ్గించగలిగితే ప్రస్తుత ఖాతా లోటు (Current Account Deficit) తగ్గుతుందని, దాంతో రూపాయిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇది మొదటిసారి కాదు. మోదీ గతంలో కూడా పలుమార్లు ‘మన్ కీ బాత్’ వంటి కార్యక్రమాల్లో వంటనూనె వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారు. అయితే ఈసారి ఆయన పిలుపులో కేవలం ఆరోగ్య పరమైన అంశమే కాదు.. ఆర్థిక కోణం కూడా బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అవసరం లేని దిగుమతులను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో వంటనూనె దిగుమతులు కూడా కీలక అంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో “వంటనూనె తగ్గిస్తే ప్రత్యామ్నాయం ఏమిటి?” అన్న ప్రశ్న సహజంగానే ప్రజల్లో వస్తోంది. ఈ అంశంపై ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

జోటా హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు చెందిన ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సుజిత్ పాల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పిలుపు వెనుక ఒక పెద్ద ప్రజారోగ్య సమస్య దాగి ఉందన్నారు. ప్రస్తుతం ప్రజలు అధికంగా వేయించిన ఆహారాలు, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారని చెప్పారు. శరీరానికి చాలా తక్కువ పరిమాణంలోనే నూనె అవసరమవుతుందని, అధికంగా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

అయితే నూనెను పూర్తిగా మానేయాలని కాదు.. వంట విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆవిరి వంటలు, గ్రిల్లింగ్, రోస్టింగ్, ప్రెజర్ కుకింగ్, తక్కువ నూనెతో వేపడం, ఎయిర్ ఫ్రైయింగ్ వంటి పద్ధతులు ఉపయోగిస్తే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చన్నారు. సంప్రదాయ భారతీయ వంటకాలలోనే దీనికి పరిష్కారం ఉందని చెప్పారు. ఉడికించడం, పెరుగు ఆధారిత కూరలు, టమాటా బేస్ వంటలు చాలా తక్కువ నూనెతో తయారవుతాయని వివరించారు.

“రుచికోసం తప్పనిసరిగా ఎక్కువ నూనె అవసరం లేదు” అని డాక్టర్ సుజిత్ పాల్ స్పష్టం చేశారు. నూనెకు బదులుగా నట్స్, గింజలు, అవకాడో, ఫ్యాటీ ఫిష్ వంటి సహజ ఆరోగ్యకర కొవ్వులు ఉన్న పదార్థాలను ఉపయోగించాలని సూచించారు. అలాగే వెల్లుల్లి, నిమ్మరసం, పెరుగు, టమాటా, సుగంధ ద్రవ్యాలు వంటకాల రుచిని పెంచుతాయని చెప్పారు.

వంట నూనె మితంగా వాడటం, అవగాహన పెంపు, దీర్ఘకాలిక ఆరోగ్యం…. అనే మూడు అంశాలే ఇప్పుడు ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కోట్లాది కుటుంబాలు వంటనూనె వినియోగాన్ని కొద్దిగా అయినా తగ్గిస్తే దేశ విదేశీ మారక నిల్వలపై భారీ ప్రభావం పడుతుందని, ప్రస్తుత ఖాతా లోటు తగ్గుతుందని, రూపాయి విలువ స్థిరపడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉంటారని చెబుతున్నారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్