తెలంగాణలో దాదాపు 10 వేల ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య పెరగనుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే,.. ఎన్ని సీట్లు పెంచుతారన్న సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో దాదాపు 10 వేల వరకు సీట్లు పెరిగే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. సీట్లను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల నమోదుకు ఇచ్చిన గడువును రేపటి వరకు పొడిగించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 98 వేల 296 ఇంజనీరింగ్ సీట్లకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించినవే . అయితే అదనపు సీట్లకు అనుమతివ్వాలని కాలేజీల యజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. 20వేల సీట్ల వరకు పెంచాలని కాలేజీలు కోరినప్పటికీ.. పరిశీలించిన ప్రభుత్వం 10 వేల సీట్ల వరకు పెంచడానికి అనుమతించినట్టు సమాచారం. పెరిగిన సీట్లలో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించినవే ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఈసారి కోర్సుల కన్వర్షన్ పెద్ద ఎత్తున జరిగింది. పెద్దగా డిమాండ్లేని సివిల్, మెకానికల్ వంటి కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుని, డిమాండ్ భారీగా ఉన్న కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవడానికే చాలా కాలేజీలు ఆసక్తి చూపాయి. కోర్సుల కన్వర్షన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో.. పరిశీలించిన అధికారులు 7వేల సీట్ల వరకు కోర్సుల కన్వర్షన్కు అనుమతించింది. ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లోని సీట్ల సంఖ్య పెరగనుంది. ఇంజనీరింగ్ సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అభ్యర్థులు నమోదు చేసుకునే వెబ్ ఆప్షన్ల గడువును రేపటి వరకు పొడిగించారు. దీంతో అభ్యర్థులు తాము కోరుకునే కాలేజీల్లో కోరుకున్న సీట్ల కోసం వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం లభించింది.


