పవన్ కల్యాణ్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలుస్తారా ? చట్టసభల్లోకి అడుగు పెడతారా ? పవర్ స్టార్ ఫ్యాన్స్ తోపాటు జనసేన నాయకుల్లోనే కాదు. సామాన్య ప్రజల్లోనూ దీనిపైనే ఎన్నో చర్చలు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవర్ స్టార్. తాజా ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి అందరి అంచనాలు పటా పంచలు చేస్తూ బంపర్ విక్టరీ కొట్టారు. దాదాపు 70 వేలపై చిలుకు ఓట్ల మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఒక్కసారి గెలిపించండి మీ కష్టాలు, కన్నీళ్లు తుడుస్తా మీకు అన్నగా, బిడ్డగా అండగా నిలబడతా అంటూ పవన్ చేసిన విజ్ఞప్తిని పిఠాపురం ఓటర్లు మన్నించారు. దీంతో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వంగా గీతపై విజయం సాధిం చారు జనసేన అధినేత పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కొణిదెల పవన్ కల్యాణ్.నిజానికి పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారైనా గెలుస్తారా లేదంటే మళ్లీ ఓట మి తప్పదా అన్న చర్చ గట్టిగానే సాగింది. ఇందుకు కారణం 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని రెండుచోట్ల నుంచీ ఓటమి పాలవడమే కారణం. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో ఆయా స్థానాల నుంచి కాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్న పిఠాపురం నుంచి బరిలో దిగారు. దీంతో అధికార పక్షం విమర్శలు గుప్పించినా, అవేవీ పట్టించుకోలేదు పవన్ కల్యాణ్.
ఓవైపు టీడీపీ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూనే జనసేన అధినేతగా తన సొంత పార్టీ బాధ్యతల్నీ మరోవైపు మోసుకుంటూ వచ్చారు పవన్. అదే సమయంలో తనను ఓడించేందుకు ప్రతిపక్ష వైసీపీ ఎన్నో ఎత్తులు మరెన్నో వ్యూహాలు రచిస్తోందని పసిగట్టిన ఆయన తాను పోటీ చేస్తున్న నియోజక వర్గాన్ని సైతం గట్టిగానే చుట్టేశారు. పలుమార్లు పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిం చారు. దీంతో ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే రెండుచోట్లా ఓడిపోవడంతో కొంత సానుభూతి సొంతం చేసుకు న్నారు పవన్ కల్యాణ్. అదే సమయంలో తమవాడైన పవన్ పోటీ చేస్తుండడం, అధికార పక్షం నుంచి దాడి మరింత పెరగడంతో కాపు సామాజిక వర్గం గంప గుత్తగా పవన్కే జైకొట్టారు. దీనికి తోడు సీఎం జగన్ తన కామెంట్లలో పవన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా జనసేనానికి కలిసి వచ్చింది. అంతే అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించారు పవన్ కళ్యాణ్. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.


