సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దేశంలో సైబర్ నేరాలు.. నేరగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఓ
వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది దానిపేరే చక్షు. చక్షు అనేది సంస్కృతం పదం, దీని అర్థం ” కన్ను “ఈ చక్షు నేరగాళ్ళ పాలిట సింహా స్వప్నంగా మారనుందా.?
గూగుల్ లోకి వెళ్లి https://sancharsaathi.gov.in/ వెబ్సైట్ ద్వారా పోర్టల్లో మొదట లాగిన్ అవ్వాలి. వెబ్ పేజీలోని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం ఓపెన్ చేసి చక్షు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ పోర్టల్లో మనకు ఫోన్ కాల్, వాట్సప్, మెసేజ్లలోని దేని ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ప్రలోభపెట్టారో తెలియజేయాలి. సందేశం వచ్చిన కేటగిరిని ఎంచుకోవాలి. కేటగిరీలో బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ, గ్యాస్, విద్యుత్తు, బీమా పాలసీ, ప్రభుత్వ అధికారులు..వారి బంధువుల పేరిట కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ హెల్ప్లైన్, ఆన్లైన్ జాబ్, లాటరీ, బహుమతులు, లోన్ ఆఫర్లు, హానికరమైన లింక్లు, వెబ్సైట్లు అనే ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఏ తరహా మోసానికి బాధితులయ్యారో ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోసపూరితమైన కాల్, సందేశం వచ్చిన తేదీ, సమయం తెలియజేయాలి. అనంతరం ఫిర్యాదుకు సంబంధించి వివరాలు తెలియజేయాలి. ఫిర్యాదుదారుని పేరుతో పాటు మొబైల్ నంబరు పొందుపరచాలి. సెల్ఫ్ మానిటరింగ్ కోసం ఓటీపీ వస్తుంది. చివరిగా క్యాప్చను ఎంటర్ చేస్తే ఫిర్యాదు పూర్తవుతుంది.
సైబర్ నేరగాళ్లు ప్రజలకు మెస్సేజ్ లు పంపిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.ఇటీవలే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ వాట్సప్లో సందేశం వచ్చింది. ఆ నంబరును సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతనిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. LKPSL అనే యాప్ ద్వారా షేర్ల క్రయవిక్రయాలు చేయాలని సూచించగా.. బాధితుడు అలాగే చేశారు. మొదట్లో కొంత మేర లాభాలు ఎర చూపించారు. అనంతరం అతని నుంచి రూ.34 లక్షలు స్వాహా చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చక్షు ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్, ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనే కొత్త పోర్టల్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానిత, మోసపూరితమైన కాల్స్, వాట్సాప్ సందేశాల వివరాలను పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పోగొట్టు కున్న లేదా చోరీకి గురైన మొబైల్స్ ను బ్లాక్ లేదా ట్రాక్ చేయవచ్చు. అనుమానాస్పద విదేశీ నంబర్ల పై పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు చక్షు విభాగం పరిశీలన అనంతరం అది మోసపూరిత మని తేలితే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులకు సమాచారం అందజేస్తుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుడిని అప్రమత్తం చేస్తుంది.
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో ఇప్పటివరకు మోసపూరిత లావాదేవీలతో అనుసంధానమైన పలు బ్యాంక్ ఖాతాల్లోని 1,008 కోట్లను జప్తు చేసింది. ప్రజలు ఈ తరహా మోసాలకు గురైనట్లయితే దాన్ని చక్షు పోర్టలో ఫిర్యాదు చేయొచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్న కోటి మొబైల్ నంబర్లను గత 10 నెలల్లో తొలగించారు. మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలకు చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సైబర్ మోసాలను గుర్తించి, నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


