మైలవరం టీడీపీలో ముసలం మొదలైంది. టికెట్ ఆశించి భంగపడ్డ దేవినేని ఉమా.. తనకు అనుకూలంగా ఉన్న నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పేరును ప్రకటించడంతో ఉమా అనుచరులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దేవినేని ఉమా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని, మైలవరం మండలం గణపవరం నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీడీపీకి రాజీనామా చేసి ఉమా వెంట నడిచేందుకు సిద్దమైనట్లు సమాచారం.
నాలుగున్నరేళ్ళుగా ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో పని చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలఫై రాజీలేని పోరాటం చేసిన ఉమాకు పార్టీ ద్రోహం చేసిందని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు ఉమా అనుచరులు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్.. తమపై కేసులు పెట్టి వేధిస్తే ఇప్పుడు టీడీపీ తరపున టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని అంటున్నారు. పార్టీ నిర్ణయం మార్చుకొని అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం దేవినేని ఉమా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీకీ రాజీనామా చేస్తే తాము కూడా ఆయనతో కలిసి పని చేస్తామని మెజార్టీ నాయకులు అంటున్నారు.