మూడు రాజధానులంటూ రాజకీయ వేడి రాజేసిన ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని ప్రకటించారు. ఈసారి సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సహకారం ఉండాలని ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలన్నారు. సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుం దని అభిప్రాయపడ్డారు.
అమరావతికి తాను వ్యతిరేకం కాదన్న సీఎం జగన్ శాసన రాజధానిగా అది కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో 50 వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని తెలిపారు. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని సీఎం అన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు.


