ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. దేశ రాజధానిలో ఆప్ 4 ఎంపీ సీట్లలోనూ, కాంగ్రెస్ 3 సీట్ల లోనూ పోటీ చేస్తాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీలు అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియా అలయన్స్ లో నిర్ణయం మేరకు ఈ సీట్ల పంపిణీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాందినీ చౌక్, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఆమ్ ఆద్మీపార్టీ సౌత్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను నిలుపుతుంది. కాంగ్రెస్ ఒక స్థానంలో దళిత అభ్యర్థిని, మరో స్థానంలో మహిళా అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించింది. దీనికి బదులుగా కాంగ్రెస్ హర్యానాలో 1 స్థానం, గుజరాత్ లో 2 స్థానాలను, ఆప్ కు కేటాయిస్తుంది. మరోపక్క సౌత్ గోవా స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించేందుకు ఆప్ సిద్ధమైంది.