బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి అధికారం చేపట్టడం ఖరారైంది. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధిం చింది. మొత్తం 300 సీట్లకుగానూ 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌంటింగ్లో అవామీ లీగ్ 200 స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
షేక్ హసీనా గోపాల్గంజ్-3 స్థానం నుంచి వరుసగా 8వ సారి అత్యంత భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఆమె 2 లక్షలా 49 వేల 965 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ అభ్యర్థి నిజా ముద్దీన్ లష్కర్కు 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవాళ పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సహా 15 ఇతర పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో అవామీ లీగ్ అభ్యర్థులు, స్వతంత్రులు మినహా ఇతర ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో ఓటర్లు పోలింగ్పై ఆసక్తి చూపలేదు. విపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య నిన్న సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్లో 40 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల నాటి 80 శాతం పోలింగ్తో పోలిస్తే ఇది చాలా తక్కువ.


