ఆంధ్రప్రదేశ్లో అంగన్ వాడీల సమ్మె ఉధృతరూపం దాల్చింది. ఇప్పటికే 25 రోజులకుపైగా ధర్నాలు, నిరసనలు, మానవహారాలు నిర్వహించి తమ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించారు అంగన్ వాడీలు. అయితే… ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఏకంగా ప్రజాప్రతినిధులు ఇళ్లు ముట్టడించారు. కలెక్టరేట్ల వద్ద నిరసనలు జరిపారు.
రోజురోజుకూ పరిస్థితి చేయి దాటుతుండడంతో జగన్ ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగింది. ఏకంగా ఎస్మాను ప్రయోగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు..అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. దీంతో.. ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. జగన్ సర్కారు నిర్ణయంపై అంగన్ వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు.
ఎస్మా ప్రయోగించడంతో ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేదిస్తున్నట్లు స్పష్టం చేసింది జగన్ సర్కారు. మరోవైపు.. సమ్మె చేసిన కాలానికి సంబంధించి అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు మూడున్నర వేల మేర తగ్గించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో వేసింది. ఈ చర్యలపై విపక్షాలు సైతం భగ్గుమంటున్నాయి. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలిచ్చి ఇప్పుడు మాట తప్పడం సరికాదని హితవు పలుకుతున్నాయి.
అంగన్ వాడీలు, విపక్షాల మాట ఎలా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని చెబుతోంది. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్బిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని.. వారి ప్రాణాలు కాపాడే బాధ్యత సర్కారుపై ఉందన్నారు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంగన్ వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారని.. వెంటనే విధుల్లో చేరాలని సూచించారు సజ్జల.
ఎస్మా అంటే ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్టెనెన్స్ యాక్ట్కు సంక్షిప్త రూపం. సమ్మెలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్న సందర్భాల్లో ప్రజల రోజువారీ జీవితాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 1981లో ఈ చట్టాన్ని రూపొందించారు. ఎస్మా నిబంధనలు ఉల్లంఘిస్తే నేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండానే, వారెంటే లేకుండానే అరెస్ట్ చేయవచ్చు.
https://youtu.be/DpPxYK3Z4Rc


