స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ అతి వేగంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 290 మంది వరకు చనిపోగా.. మరో 1000 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.
తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విని బాధపడ్డాను. ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని కోహ్లీ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.