స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేతకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్మిస్తున్న ఆవులపల్లి, నేతిగుట్టపల్లె, ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనుల్ని వెంటనే ఆపాలని గతంలో ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఉల్లంఘనలపై రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. రూ.100 కోట్ల జరిమానాపై మాత్రమే పాక్షికంగా అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.ప్రస్తుతానికైతే.. రూ. 25 కోట్లు కృష్ణా బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది.