Minister Vidadala Rajini | ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో జరుగుతున్న కిడ్నీ మోసాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. విశాఖలోని పెందుర్తి తిరుమల ఆస్పత్రి ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే విచారణకు ఆదేశించామని ఒక ప్రకటనలో తెలిపారు. కిడ్నీ రాకెట్ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. ఇలాంటి ఘటన మరెక్కడా కూడా పునరావృతం కావద్దని తెలిపారు. ఈ ఘటనపై విశాఖ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి పెందుర్తి తిరుమల ఆస్పత్రిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అసలు తిరుమల ఆస్పత్రికి అనుమతులే లేవని అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని… వారి నుండి అసలు నిజాలు రాబడతామని అన్నారు. ఈ రాకెట్ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వేస్తామని స్పష్టం చేశారు.