కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేశానికి ముగ్గురు మాజీ ప్రధానులు అందించిన సేవలను కొనియాడారు. కాగా, ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్కు భారతరత్న ప్రకటించింది.
రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు భారత దేశానికి అందించిన సేవలు అపారం అని ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని కొనియాడారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందన్నారు. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని గుర్తు చేశారు. పీవీ పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందని గుర్తు చేశారు. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది అని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.