మనదేశంలో లంచం ఇవ్వడం కానీ.. తీసుకోవడం కానీ నేరం. మరి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో జరుగుతున్నది దేంటి? దేశంలో కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు తమ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలకు ఇష్టంవచ్చినంత సొమ్మును విరాళంగా ఇవ్వడం ద్వారా.. ఆయా ప్రభుత్వాల నుంచి భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందుతున్నాయి. ఇది లంచం కాదా… పాలిష్డ్ భాషలో క్విడ్ ప్రో అనవచ్చేమో.. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని పలు కార్పొరేట్ సంస్థలు “చందా ఇచ్చుకో.. దందా చేసుకో” అన్నపథకంగా మార్చేశాయి. అందుకే సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల వల్ల భారీగా లబ్ధి పొందింది అధికార బీజేపీనే. అన్నిరాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందే అవకాశం చట్ట ప్రకారం కల్పించినా.. నరేంద్రమోదీ సర్కార్ భారీ ఎత్తున నిధుల సేకరణకు పలు మార్గాలను అనుసరించింది. బాండ్ల పేరుతో పలు పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల ముక్కుపిండి కోట్లాది రూపాయల మేరకు నిధులు సమకూర్చుకుంది. తమకు భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ విధానాలను మార్చింది. నయానో.. భయానో.. పారిశ్రామిక సంస్థలనుంచి ఎన్నికల నిధులు సమకూర్చుకుంది. ఎన్నికల బాండ్ల కోసం 2018 లో రూపొందించిన మార్గ దర్శకాల ప్రకారమే ఏ కోర్టు కయినా సమాచారం ఇవ్వాలన్న నిబంధన చట్టంలో చేర్చారంటే.. మోదీ సర్కార్ ఎంత పకడ్బందీగా చట్టాన్ని రూపొందించిందో అర్థమవుతుంది.
సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించినా.. 2024 లోక్ సభ ఎన్నికలలోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెలుగులోకి రాకుండా…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరు, ఆడిన నాటకాలు…. “రాజును మించిన రాజభక్తులు ” అన్న సామెతను గుర్తు చేస్తుంది. ఫిబ్రవరి 15న ఎన్నికల బాండ్లను రద్దుచేసిన సుప్రీంకోర్టు 26 రోజులలోగా…అంటే మార్చి 6 లోగా బాండ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్ కు అందజేయాలని ఆదేశించింది. ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్ లో ఉంచేలా ఆదేశించింది. ఆ ఆదేశాలను పాటించకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుంటి సాకులు చెప్పింది. ఆ వివరాలు అందజేయడానికి జూన్ 30 వరక గడువు ఇవ్వాలని కోరుతూ మార్చి 4న సుప్రీంకోర్టు లో ఎస్ బీఐ పిటిషన్ దాఖలు చేసింది. బాండ్ల వివరాలు బయటపెట్టకుండా ఎస్ బీఐ చేస్తున్న యత్నాల వెనుక అసలు శక్తులెవరో సుప్రీంకోర్టుతో సహా, దేశప్రజలందరికీ తెలిసిపోయింది. దీంతో సుప్రీం కోర్టు మరో సారి కొరడా ఝళిపించింది. ఆ విధంగా కుట్రలకు అడ్డుకట్ట వేసింది. దిగివచ్చిన ఎస్ బీఐ బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాలనూ అటు ఈసీకి ఇటు సుప్రీంకోర్టుకు సమర్పించి పరువు నిలుపుకుంది. కానీ, బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన 466 కోట్ల రూపాయలను ఎవరూ ఇచ్చారో తెలియడం లేదు వివరాలు అరకొరగానే ఉన్నాయి. మళ్లీ సుప్రీంకోర్టు అక్షింతలు పడక తప్పదేమో…
ఎలక్టోరల్ బాండ్లు పొందిన ఇతర బడా రాజకీయ పార్టీలలో పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణకు చెందిన భారత రాష్ట్రీయ సమితి, భారత జాతీయ కాంగ్రెస్, డిఎంకె, జేడీయూ, ఆర్డేడీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు కూడా.. భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలకు, వ్యక్తులకు ఇతోధికంగా.. లబ్ధి చేకూర్చడం ద్వారా చందా తే.. దందా చేసుకో అన్న విధంగానే నిధుల సేకరణకు పాల్పడ్డాయి.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడంతో ఏ రాజకీయ పార్టీ ఎంతెంత విరాళం ఇచ్చిందో.. ఏ లబ్ధి పొందిందో వెలుగులోకి వచ్చింది. ఉదాహరణకు ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాడు. ఐదు కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొని విరాళంగా ఇచ్చి 1098 కోట్ల రూపాయల విలువైన సున్నీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు కొట్టేశాడు. ఓ రెండు నెలల్ల తర్వాత.. సీఎం రమేశ్ కంపెనీ మరో 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొన్నారు.. ఆ మొత్తం.. ఎవరికి ఇచ్చారో.. ఎందుకు ఇచ్చారో.. బహిరంగ రహస్యమే.. ఇదీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో క్విడ్ ప్రో.. దందా..
అధికార బీజేపీ 9 కంపెనీల నుంచి వందకోట్ల రూపాయలకు పైగా విరాళాలు దండుకుంది. అలా నిధులు సమకూర్చిన కంపెనీల్లో భారతి ఎయిర్ టెల్, వేదాంత, మదన్ లాల్ లిమిటెడ్ , బిర్లా కార్బన్ ఇండియా, క్విక్ సప్లైస్, వంటి కంపెనీలు ఉన్నాయి …ఇవన్నీ విరాళాలు ఇచ్చి లబ్ధి పొందిన కంపెనీలే..