స్వతంత్ర, వెబ్ డెస్క్: కేసీఆర్ కి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం కట్టించే బాధ్యత మాదని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చర్లపల్లి జైలులో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కలిసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రేవంత్ మాట్లాడుతూ… నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ఘనత కాంగ్రెస్ దని కొనియాడారు. నక్సల్బరీ ఉద్యమం ప్రజలకు భూములను పంచి పెట్టింది. నక్సలైట్ల నుండి కాంగ్రెస్ వరకు పేదలకు భూ పంపిణీ జరిగింది. యాజమాన్యపు హక్కులు లేని వారికి లక్షల ఎకరాలను కాంగ్రెస్ పంచిందని అన్నారు.
పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూ వివరాలు గ్రామంలోనే ఉండేవి.కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉండేవి.2004 లో కాగితపు రికార్డులు భూ భారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లల్లో 23వేల ఎకరాల భూదాన్ భూములున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రామమైన తిమ్మాపూర్లో భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని భూదాన్ బోర్డు అక్కడి కలెక్టర్ కి లెటర్ రాశారు. కిషన్ రెడ్డి ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు కూడా భూదాన్ భూములపై అప్పటి కలెక్టర్ కి లేఖ రాశారు. ధరణి రాకముందు నిషేధిత భూములుగా ఉన్న భూదాన్ భూములపై ధరణి వచ్చాక నిషేధం ఎత్తేశారు. భూదాన్ భూములు ధరణి వచ్చాక కేటీఆర్ అనుచరుల పేర్ల పైకి వెళ్లిపోయాయి. తన గ్రామంలోని భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అంటూ ప్రశ్నించారు. వెయ్యి కోట్ల రూపాయల భూములు కేటీఆర్ అనుచరులు కొట్టేస్తున్నాడు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మందు రైతులు పడిగాపులు కాస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని అన్నారు.
ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30% కమిషన్ ఇవ్వాల్సిందే. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్ కి ఏడుపు ఎందుకు? అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో కూడా ధరణి బాధితులు తమ ఆవేదన తెలియచేశారని అన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు భీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యుజ్ చేస్తున్నారు. రాష్ట్ర భూముల వివరాలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవన్న రేవంత్.. ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ధరణి ఫిర్యాదు దారుల నుండి వసూలు చేసే వెయ్యి రూపాయల రుసుము ఎక్కడికి పోతుంది? అంటూ ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.