స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ముఖ్యంగా ఛేదనలో కోహ్లీ మరోసారి కింగ్ అనిపించుకున్నాడు. తన దూకుడైన బ్యాటింగ్ తో సెంచరీ చేసి శభాష్ అనిపించాడు. గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన SRH, RCB మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఇచ్చింది. ఒకే మ్యాచులో రెండు జట్ల తరఫున సెంచరీలు నమోదవడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 186/5 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయినా హెన్రిచ్ క్లాసెన్ తన క్లాస్ ఆటతో రెచ్చిపోయాడు. ఏకంగా 49 బంతుల్లోనే సెంచరీ చేసి హైదరాబాద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆర్సీబీ బౌలర్లలో బ్రేస్ వెల్ రెండు వికెట్లు తీశాడు.
187 లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. అద్భుతమైన ఫాంలో ఉన్న కెప్టెన్ డుప్లిసెస్(71), కోహ్లీ(100) హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు కొడుతూ చుక్కలు చూపించారు. వీరి విధ్వంసకర ఆటతో 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది ఆర్సీబీ. ఈ విజయంతో 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు సొంతగడ్డపై ఘోర పరాజయంతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది సన్ రైజర్స్.